Friday, July 03, 2015

దారుణం (కవిత)


వాళ్ల ఆనందం... దేవుని కన్నుకుట్టిందేమో....
వాళ్ల పరవశం.... ప్రకృతి కుళ్లుకుందేమో....
ఫలితం.... ఒక దారుణం
*****
చదువులమ్మ చల్లని ఒడిలో నిద్రించాల్సినవాళ్లు
మృత్యుకౌగిలిలో నిర్జీవులై పడున్నారు....
చిరకాల గుర్తులుగా ఉంచుకోవాల్సినవాళ్లు
చివరి గుర్తులుగా మిగిలారు.....
చుట్టున్న అందమైన లోకంలో విహరిస్తూ
అందరాని లోకానికి వెళ్లిపోయారు....
*****
ఇరవైఐదు సంవత్సరాల ప్రాయంలో
నూరేళ్లు నిండాయేమో....
మృత్యువు తమని కబళిస్తుందని తెలిసి
ఆ పసి హృదయాలు ఎంతగా తల్లడిల్లాయో....
ఎవరైనా తమని రక్షిస్తారని
ఎంతగా ఎదురుచూశాయో....
ఆ చీకటి ప్రవాహంలో
చివరి శ్వాసవరకు ఎంతగా రోదించాయో.....
*****
కళ్లముందే సన్నిహితుల్ని జలప్రళయం మింగేస్తున్న
ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితి నరకంకాక మరేమిటి...
ఇలాంటి అనుభవం పగవారికి కూడా రాకూడదు ఏనాటికీ..... ప్రణయ్. (12.06.2014)
(10.06.2014. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో జరిగిన సంఘటనకు చలించి)

No comments:

Post a Comment